అల్లాహ్ దయమానవులు తప్పు చేస్తారని, ఎక్కువమంది నరకంలో వెళ్తారని తెలిసి కూడా దయామయుడైన అల్లాహ్ మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? అని ఎందరో, ప్రత్యేకంగా ముస్లిమేతరులు ప్రశ్నిస్తారు. మానవులు నరకంలో కాలటం అల్లాహ్ ఎలా చూడగలడు? ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాము కాబట్టి, ఇలాంటి విషయాలు చర్చించడం అవివేకం. ఎందుకంటే ఇప్పుడు ఏది మారదు. మానవునికి ఉత్సుకత ఎక్కువ, కావున ముందుగా అల్లాహ్ ఈ సృష్టిని సృష్టించిన కారణం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం.
అసలు వాదం ఏమనగా: మానవుల్లో ఎక్కువమంది నరకానికి వెళుతారు కాబట్టి, అల్లాహ్ మానవుడిని ఎందుకు సృష్టించాడు.
ఇదే తర్కం ప్రకారం అల్లాహ్ జంతువుల్ని ఎందుకు సృష్టించాడు. ఒకటి మరోదానిని చంపి తింటుంది కదా.
ఉదాహరణకు: జింకను పులి చంపుతుంది, ఎలుకను పిల్లి చంపుతుంది, మొక్కలను ఆవులు, మేకలు తింటాయి.
మీ తర్కం ప్రకారం జంతువులు, చెట్లు ఉండకూడదు. అసలు అల్లాహ్ ఏ జీవసృష్టిని సృష్టించాల్సింది కాదు. ఎందుకంటే ఒకటి ఇంకోదానిపై ఆధారపడి చంపుకు తింటున్నాయి.
జీవరాశులే లేనప్పుడు ఇంత పెద్ద సృష్టి ఎందుకు సృష్టించబడింది?
అల్లాహ్ కు రక్త దాహం లేదు మరియు మానవులను నరకంలో శిక్షించడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అని అర్ధమయ్యాక అసలు నరకంలో ఎవరు వెళ్తారు అనేది తెలుసుకోవడం అవసరం.
“దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు.” ఖుర్ఆన్, సూరా లైల్ 92:15
హజ్రత్ అబుహురైరా రజియల్లాహ్ అన్హు కధనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నన్ను తిరస్కరించినవారు తప్ప, నా సమాజంలో ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి వెళతారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు. ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు స్వర్గం లోకి ప్రవేశిస్తారు. సహీహ్ బుఖారీ vol 9:384
పైన తెలిపిన ఖుర్ ఆన్ మరియు హదీస్ వాక్యాల ప్రకారంగా అవిశ్వాసులు వారి పాప కర్మల ప్రకారమే నరకంలోకి పడవేయబడతారు.
“ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడువారు, "అయ్యో! మేము అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపిఉంటే ఎంతబావుండేది?" అని అంటారు. ఇంకా ఇలా అంటారు: "ప్రభూ! మేము మా సర్దారులు, పెద్దలు చెప్పినట్లు విన్నాము. వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు. "ప్రభూ! నీవు వారికి రెండింతల శిక్షను విధించు. వారిపై పెద్ద శాపాన్ని అవతరింపజెయ్యి. "ఖుర్ఆన్, సూరా అహ్జాబ్ 33:66-68
తమ ప్రభువును తిరస్కరించిన వారికి నరకయాతన తథ్యం. అదెంత చెడ్డ గమ్య స్థలం. వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది. ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది. అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా, దాని రక్షకులు వారినుద్దేశించి, “ఏమిటి, మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా?” అని అడుగుతారు. “ఎందుకు రాలేదు? హెచ్చరించే వాడొకడు వచ్చాడు. కాని మేమే అతణ్ణి ధిక్కరించాము. ‘అల్లాహ్ దేనినీ అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నార’ని (సూటిగా) చెప్పేశాము” అని వారు ఒప్పుకుంటారు. వారు ఇంకా ఇలా అంటారు : “మేము విని ఉంటే లేదా బుద్ధిపెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్లతో చేరేవాళ్ళం కాము.” ఆ విధంగా వారు తమ తప్పును (పాపాన్ని) ఒప్పుకుంటారు. కనుక ఈ నరకవాసులు (దైవకారుణ్యానికి) దూరమవుదురుగాక! ఖుర్ఆన్, సూరా ముల్క్ 67:6-11
పైన తెలిపిన వాక్యాల ప్రకారం మనకు ఖుర్ ఆన్ లో చాలా వాక్యాలు అవిశ్వాసులు వారి తిరస్కార వైఖరి కారణంగా వారు నరకంలోకి పడవేయబడతారు అని స్పష్టంగా తెలియజేయబడింది.
“ఆ రోజు ప్రతివ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్నిహెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు.” ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:30
పైన తెలిపిన వాక్యం ప్రకారం ప్రతి వ్యక్తి పాపానికి దూరంగా ఉండమని తెలియ జేస్తుంది. ఎవరైతే పాపాలు చేస్తారో ఆ వ్యక్తి తనకు తాను నష్టానికి గురి అవుతాడు. అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్నిరెట్టింపుచేస్తాడు. అంతేకాదు, తన వద్ద నున్నదానిలోనుంచి గొప్పప్రతిఫలాన్నివొసగుతాడు. ఖుర్ఆన్, సూరా నిసా 4:40
కర్మలపత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ,"అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీవదలకుండా నమోదు చేసిందే?!" అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. ఖుర్ఆన్, సూరా కహఫ్ 18:49
సన్మార్గాన్ని పొందే వాడు తన మేలు కోసమే సన్మార్గాన్నిపొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడౌతాడు. బరువు మోసే వాడెవడూ ఇంకొకరి బరువును తనపై వేసుకోడు.ఒక ప్రవక్తను పంపనంత వరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. ఖుర్ఆన్, సూరా ఇస్రా 17:15
పైన తెలిపిన ఖుర్ ఆన్ వాక్యం ప్రకారం మనకు తెలిసినదేమిటంటే అల్లాహ్ ఎవరికీ అన్యాయం చేయడు. ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రకారమే ఫ్రతిఫలాన్ని అందిస్తాడు.
అల్లాహ్ సుబుహానహు వత’ఆల చాలా దయామయుడు. అల్లాహ్ కావాలని ఏ వ్యక్తిని కూడా నరకం లోనికి పడవేయడు. ఎందుకంటే అల్లాహ్ కరుణ ఈ సృష్టి అంతటిని ఆవరించి వుంది. అల్లాహ్ మన పుణ్యాలను చాలా రెట్లు పెంచుతాడు. మరియు చాలా సార్లు క్షమిస్తాడు.
అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్నిరెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు.ఖుర్ఆన్, సూరా నిసా 4:40
సత్కార్యం చేసిన వాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి.దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్షమాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు.ఖుర్ఆన్, సూరా అనామ్ 6:160
ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు కధనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మానవుడు ఏదైనా ఒక చిన్న పుణ్యం చేయాలని నిశ్చయించుకొని ఆ పుణ్యాన్ని చేయకపోతే అల్లాహ్ ఆ వ్యక్తి ఖాతాలో ఒక పుణ్యాన్ని వ్రాస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పుణ్యాన్ని చేస్తే అల్లాహ్ అతని ఖాతాలో 10 నుండి 700రెట్లు వరకు మరియు అంత కంటే ఎక్కువ గల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఒక పాపం చేయాలని నిశ్చయించుకొని ఆ పాపం చేయకపోతే అల్లాహ్ ఆ వ్యక్తి ఖాతాలో ఒక పుణ్యాన్ని వ్రాస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఆ వ్యక్తికి ఆ పాపానికి సరిపోయేటట్లు ఒక పాపాన్ని అతని ఖాతాలో వ్రాస్తాడు. సహీహ్ ముస్లిం 237
పైన తెలిపిన ఖుర్ ఆన్ వాక్యం మరియు హదీస్ ప్రకారం మానవులు చేసే ప్రతి చిన్న పుణ్యం పై అల్లాహ్ కరుణ ఉంటుంది.
ఒకవేళ ఓ వ్యక్తి ఒక పుణ్యం చేస్తే అల్లాహ్ ఆ వ్యక్తికి ఆ పుణ్యానికి బదులు 10నుండి 700రెట్లు పుణ్యాలను ప్రసాదిస్తాడు.
ఒకవేళ ఓ వ్యక్తి ఒక పుణ్యం చేయాలనుకొని కూడా ఆ పుణ్యం చేయకుంటే, ఆ వ్యక్తికి ఒక పుణ్యం వ్రాయబడుతుంది.
ఒకవేళ ఓ వ్యక్తి పాపం చేయాలని నిశ్చయించుకొని ఆ పాపం చేయకపోతే, ఆ వ్యక్తికి ఒక పుణ్యం వ్రాయబడుతుంది.
ఒక వ్యక్తి కేవలం ఒకే పాపం చేస్తే అతనికి ఆ చేసిన పాపాన్ని మాత్రమే కర్మల పత్రం లో నమోదు చేస్తారు.
“వీళ్లు అల్లాహ్ స్థాయికి అనుగుణంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించనేలేదు. అల్లాహ్ మహాశక్తిశాలి,ప్రాబల్యం కలవాడు.” ఖుర్ఆన్, సూరా హజ్ 22:74
అయినప్పటికీ మానవుడు పాపాలు చేస్తున్నాడు.
(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: "తమ ఆత్మలపై అన్యాయానికి ఒడి గట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.” ఖుర్ఆన్, సూరా జుమర్ 39:53
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడితే లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్ను అర్థిస్తే,అతడు అల్లాహ్ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు. ఖుర్ఆన్, సూరా నిసా 4:110
“నేనిలా అన్నాను: క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”ఖుర్ఆన్, సూరా నూహ్ 71:10
సృష్టికర్త అల్లాహ్ ఉన్నాడనే విషయం తెలిసిన ప్రతి వ్యక్తికి వారి పాప క్షమాపణ మన్నింపు కై అల్లాహ్ కరుణపై చాలా నమ్మకం ఉంటుంది.
ఎవరైనా వ్యక్తి తనను తానూ నరాకగ్ని నుంచి రక్షించుకోకపోతే, ఆ వ్యక్తికి తెలుసు నరకానికి పోవడానికి కారణం ఏమిటో, ఈ తప్పు ఆ వ్యక్తిదా లేదా అల్లాహ్ కు సంబందించినదా ?
పైన తెలిసిన విషయాల ఆధారంగా మనకు తెలిసినదేమిటంటే : అల్లాహ్ దాసులకు చెడు పరిణామాల గురించి క్లుప్తంగా హెచ్చరించాడు.
ఎవరైతే పుణ్యాలు చేయడం లో నిమగ్నం అవుతారో అల్లాహ్ వారికి రెట్టింపు ఫలితాలను అందిస్తాడు మరియు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు.
విచారణ చాలా న్యాయబద్ధంగా జరుగుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
ప్రజలు నరకంలోకి వెళితే వారి సొంత ఎంపిక ప్రకారమే వెళతారు.
ఏ ప్రజలైతే నరకంలోకి ప్రవేశిస్తారో వారు పాపాలను ఒప్పుకున్నట్లే.
“దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు.” ఖుర్ఆన్, సూరా లైల్ 92:15
కాబట్టి మనమంతా నరకాగ్ని గురించి ఆలోచించేకంటే, స్వర్గం గురించి ఎందుకు ఆలోచించకూడదు. మన ధ్యేయం స్వర్గం పొందాలనే తపన ఎందుకు కాకూడదు, ప్రతి వ్యక్తి తనకు కావాలసిన వాటి కోసం కష్టపడి తన గమ్యానికి చేరుకుంటాడు. కాబట్టి మనం కూడా త్వరగా అల్లాహ్ ముందు మనస్పూర్తిగా పశ్చాత్తాపం కోరుకుంటే అల్లాహ్ కూడా మన పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు.
|
.